శంకరంబాడి సుందరాచారి
వికీపీడియా నుండి
విషయ సూచిక |
[మార్చు] శంకరంబాడి సుందరాచారి
తెలుగు రచయితలలో శంకరంబాడి సుందరాచారి గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర గీతాన్ని అందించారు ఆయన.
[మార్చు] జీవిత విశేషాలు
ఆయన 1914 ఆగష్టు 10 న తిరుపతి లో జన్మించారు. మదనపల్లె లో ఇంటర్మీడియేటు వరకు చదివారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవారు. బ్రహ్మణోచితములైన సంధ్యా వందనం వంటి పనులు చేసే వారు కాదాయన. తండ్రి మందలించగా జంధ్యాన్ని (యజ్ఞోపవీతం) తెంపివేసారు. తండ్రి మందలింపుకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయారు.
భుక్తి కొరకు ఎన్నో పనులు చేసారు. తిరుపతి లో హోటలు లో సర్వరు గా పని చేసారు. రైల్వే స్టేషనులో పోర్టరు గా కూడా పని చేసారు. ఆంధ్ర పత్రిక లో ప్రూఫు రీడరు గా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసారాయన.
అమితమైన ఆత్మవిశ్వాసం ఆయనకు. ఒకసారి ఏదైనా పని వెతుక్కుందామని మద్రాసు వెళ్ళారు. ఆంధ్ర పత్రిక ఆఫీసుకు వెళ్ళి పని కావాలని అడిగారు. దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు గారు "నీకు తెలుగు వచ్చా" అని అడిగారు. దానికి సమధానంగా "మీకు తెలుగు రాదా" అని అడిగారు. నివ్వెర పోయిన పంతులు గారితో నేనిప్పటి వరకు తెలుగు లోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవాలో తెలియ లేదు అని అన్నారు.
ఆంధ్ర పత్రికలో ఉద్యోగం చేస్తుండగా, ఒక ప్రముఖునిపై పద్యం రాయవలసి వచ్చింది. నేను వ్యక్తులపై పద్యాలు రాయను అని భీష్మించుకుని, దాని కోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారు సుందరాచారి గారు.
తరువాత విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడిగా పని చేసారు.నందనూరు లో ఉండగా ఒకసారి పాఠశాలల డైరెక్టరు గారు వచ్చారు. ఆ డైరెక్టరు గారు సుందరాచారి గారి ప్యూనును పర్యవేక్షకుడిగా పొరబడ్డారు. దానికి కోపగించి, సుందరాచారి గారు ఆ ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసారు.
భార్య అనారోగ్యం కారణంగా ఆయన వేదన చెందారు. జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపారు. 1977 ఏప్రిల్ 8 న మరణించాడు.
తిరుపతి లో ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం నెలకొల్పింది.
[మార్చు] సాహితీ వ్యాసంగం
శంకరంబాడి సుందరాచారి గారు గొప్ప కవి. పద్య కవిత్వం ఆయనకు ప్రీతిపాత్రమైన కవితా ప్రక్రియ. పద్యాల లోనూ తేటగీతి ఆయన ఎంతో ఇష్టపడ్డ ఛందస్సు. తేటగీతి లో ఎన్నో పద్యాలు రాసారు. నా పేరు కూడా (శంకరంబాడి సుందరాచారి) తేటగీతి లో ఇమిడింది, అందుకనే నాకది బాగా ఇష్టం అనేవారు ఆయన.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి.. కూడా తేటగీతి లో రాసిందే. ఈ పద్యం ఆయన రచనల లో మణిపూస వంటిది. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నాలుగు పద్యాలు అవి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతం గా గుర్తించి గౌరవించింది.
మహాత్మా గాంధీ హత్య జరిగినపుడు ఆవేదన చెంది, బలిదానం అనే కావ్యం రాసారు. ఆ పద్యాలను పాఠశాలలో పిల్లలకు ఆయనే చదివి వినిపించారట. ఆ పద్యాలలోని కరుణ రసానికి పిల్లలు రోదించారని ప్రముఖ రచయిత పులికంటి కృష్ణా రెడ్డి గారు చెప్పారు.
సుందర రామాయణం అనే పేరుతో రామాయణం రచించారు. అలాగే సుందర భారతం కూడా రాసారు.
తిరుపతి వేకటేశ్వర స్వామి పేరు మకుటంగా శ్రీనివాస శతకం రచించారు. బుధ్ధ చరిత్ర కూడా రాసారు.
రవీంద్రుని గీతాంజలిని అనువదించారు. మూలం లో ని భావాన్ని మాత్రమే తీసుకుని, భావం చెడకుండా, తెలుగు నుడికారం పోకుండా చేసిన ఆ స్వతంత్ర అనువాదం బహు ప్రశంసలు పొందింది.
ఏకలవ్యుడు అనే ఖండకావ్యం, కెరటాలు అనే గ్రంధం కూడా రచించారు. సుందర సుధా బిందువులు అనే పేరుతో భావ గీతాలు రాసారు.
జానపద గీతాలు రాసారు, స్థల పురాణ రచనలు చేసారు.
సినిమాలకు కూడా పాటలు రాసారు. బిల్హణీయం, దీనబంధు అనే సినిమాలకు పాటలు రాసారు.
[మార్చు] ఇతర విశేషాలు
మా తెలుగు తల్లికి.. గీతాన్ని సినిమా కోసం రచించారు. కాని సినిమా వారికి అది నచ్చలేదు. శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారు ఆ పాటను మధురం గా పాడిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది.
ఒకసారి ఢిల్లీ వెళ్ళి అక్కడ నెహ్రు గారిని కలిసారు. తాను రచించిన బుధ్ధ చరిత్ర లోని ఒక పద్యాన్ని ఇంగ్లీషు లోకి అనువదించి ఆయనకు వినిపించారు. నెహ్రు గారు ముగ్ధులై ఆయనను మెచ్చుకుని 500 రూపాయలు బహూకరించారు.
[మార్చు] బిరుదులు
శంకరంబాడి సుందరాచారి గారిని ప్రసన్న కవి అని గౌరవించారు. ఆయనను భావ కవి అనీ, అహంభావ కవి అనీ కూడా అనేవారు. సుందర కవి అన్నది ఆయన మరొ పేరు.
[మార్చు] మూలాలు, వనరులు
- దూరదర్శన్ లోపులికంటి కృష్ణా రెడ్డి గారు పాల్గొన్న ఒక చర్చా కార్యక్రమం
- ఇతర పుస్తకాలు