రాజబాబు
వికీపీడియా నుండి
తెలుగు సినిమా రంగంలో రెండు దశాబ్దాలు ప్రముఖ హాస్యనటునిగా వెలిగిన రాజబాబు "శతాబ్దపు హాస్య నటుడి"గా ప్రసంశలు అందుకొన్న గొప్ప వ్యక్తి.
విషయ సూచిక |
[మార్చు] పుట్టు పూర్వోత్తరాలు
అక్టోబరు 20, 1938 తేదీన పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో పుట్టిన రాజబాబు పూర్తి పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. తల్లిదండ్రులు శ్రీ పుణ్యమూర్తుల ఉమామహేశ్వర రావు మరియు శ్రీమతి రవణమ్మ. నిడుదవోలులోని పాఠశాల చదువు చదువుతూనే బుర్రకథ నేర్చుకోవడానికి శ్రీ అచ్యుత రామయ్య గారి దగ్గర చేరారు. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయులుగా కొద్దికాలం పనిచేశారు. ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడే నాటకలల్లో పాలుపంచుకొనే వారు. రాజబాబు డిసెంబర్ 5, 1965 తేదీన లక్ష్మీ అమ్ములు గారిని వివాహమాడారు. వారికి నాగేంద్రబాబు, మహేశ్ బాబు అనే ఇద్దరు బిడ్డలు పుట్టారు.
[మార్చు] సినీ జీవితం
[మార్చు] మొదటి రోజులు
ఒక సారి నాటకంలో రాజబాబును చూసిన గరికపాటి రాజారావుగారు (పుట్టిల్ల్లు సినిమా దర్శకులు) సినిమాలలో చేరమని ఉత్సాహపరిచారు. దాంతో చెప్పాపెట్టకుండా ఫిబ్రవరి 7, 1960 రోజున మద్రాసు చేరుకొన్నారు. పూట గడవడానికి హాస్యనటుడు అడ్డాల నారాయణరావు పిల్లలకు ప్రైవేటు చెప్పేవారు. కొన్నాళ్ళ తరువాత అడ్డాల నారాయణరావుగారే రాజబాబుకి సమాజం సినిమాలో అవకాశం కల్పించారు. మొదటి సినిమా తరువాత "తండ్రులు-కొడుకులు","కులగోత్రాలు","స్వర్ణగౌరి","మంచి మనిషి" మొదలగు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. స్వర్ణగౌరి చిత్రానికి గాను 350 రూపాయలు మొట్టమొదటి పారితోషికంగా స్వీకరించారు. మొదటి సినిమా విడుదల తరువాత వచ్చిన చిన్న చిన్న సినిమా పాత్రలలో నటిస్తూనే "కుక్కపిల్ల దొరికిందా", "నాలుగిళ్ళ చావిడి", "అల్లూరి సీతారామరాజు" మొదలగు నాటకాలు వేశారు.
[మార్చు] పేరు తెచ్చిన సినిమాలు
జగపతి ఫిలింస్ వీ.బీ.రాజేంద్రప్రసాద్ సినిమా "అంతస్తులు" చ్రిత్రంలో నటించినందుకుగాను మొట్టమొదటి సారిగా పెద్దమొత్తం 1300 రూపాయల్ని పారితోషికంగా పొందారు. తరువాత వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా వరుసగా ప్రముఖ నిర్మాణ సంస్థలు సినర్మించిన ఎన్నో ప్రముఖ సినిమాలలో నటించారు. ఆ సమయంలో ఆకాశరామన్న, సతీ శబరి, ప్రచండ భైరవి, సత్యహరిశ్చంద్ర, సంగీత లక్ష్మి, పరమానందయ్య శిష్యుల కథ, ఉమ్మడి కుటుంబం, విచిత్ర కుటుంబం లాంటి చిత్రాలలో నటించారు. రాజబాబుకు జంటగా లీలా రాణి, మీనా కుమారి, ప్రసన్న రాణి, గీతాంజలి లాంటి వారు నటించినా, ప్రేక్షకాదరణ పొందిన జోడీ మాత్రం రమాప్రభ గారే. ఇద్దరు అమ్మాయిలు, ప్రేమ్ నగర్, ఇల్లు ఇల్లాలు, పల్లెటూరి బావ, సెక్రెటరి, జీవన జ్యోతి, కార్తీక దీపం, అడవి రాముడు, సోగ్గాడు లాంటి చిత్రాలు రాజబాబు-రమాప్రభ జోడికి మంచి హాస్య జంటగా ప్రేరు తెచ్చాయి.
[మార్చు] ఇతర పాత్రలు
రాజబాబు తాతా మనవడు, పిచ్చోడి పెళ్ళి, తిరుపతి, ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు లాంటి సినిమాలలో హీరోగా నటించారు. ఈ సినిమాలలో ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు సినిమాలను స్వయంగా బాబ్ & బాబ్ ప్రొడక్షన్స్ అన్న నిర్మాణ సంస్థ పేరుతో నిర్మించారు.
[మార్చు] స్వభావం
సినిమాలో ప్రేక్షకులను తన అద్భుత నటనతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వింవిన రాజబాబు నిజజీవితంలో గొప్ప తాత్విక ఆలోచనలు గలవాడు. ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటుల్ని మరియు నటీమణుల్ని సత్కరించే వారు. ప్రత్యేకంగా హాస్యంలో తనకు స్పూర్థిని ఇచ్చిన బాలకృష్ణ ను సత్కరించారు. రాజబాబుచే సత్కారం పొందిన వారిలో ఇంకా డా.శివరామకృష్ణయ్య, సూర్యకాంతం,సావిత్రి,రేలంగి మొదలగు ప్రముఖులు ఉన్నారు. ఎన్నో సంస్థలకు ఎన్నెన్నో విరాళాలిచ్చిన దాత రాజబాబు. రాజమండ్రిలో చెత్తా చెదారం శుభ్రపరిచే వాళ్ళకు అదే ఊరిలో దానవాయిపేట లో భూమి ఇచ్చాడు. అంతే కాక కోరుకొండలో జూనియర్ కాలేజీ కట్టించారు. దాని పేరుకూడాఅ ఆయన పేరు మీదే "రాజబాబు జూనియర్ కళాశాల" గా ఉంది.
[మార్చు] సత్కారాలు
వరుసగా ఏడు సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన మొట్టమొదటి హాస్యనటుడు రాజబాబు. ఆయన జీవితంలో మొత్తం తొమ్మిది ఫిలింమ్ ఫేర్ అవార్డులు, మూడు నందీ బహుమతులు, మరియు ఎన్నెన్నో అవార్డులు రివార్డులూ పాందారు. "చెన్నై ఆంధ్రా క్లబ్బు" వారు వరుసగా ఐదు సంవత్సరాలు "రోలింగ్ షీల్డు" ని ప్రధానం చేసారు. అంతే కాక శతాబ్దపు హాస్య నటుడిగా అవార్డు పొందారు.
[మార్చు] మరణం
రాజబాబుకు ఘంటసాల గారి పాటలంటే ఎంతో ఇష్టం. మహా శివరాత్రి రోజు మరియు ఘంటసాలగారి వర్ధంతి అయిన ఫిబ్రవరి 11 రోజున మొత్తం ఘంటసాలగారి పాటలు వింటూనే ఉన్నారు. అదే రోజు రాత్రి గొంతులో ఏదో ఇబ్బంది వచ్చి హైదరాబాదులోని థెరెసా ఆసుపత్రిలో చేరారు. ఆ ఆసుపత్రిలోనే ఫిబ్రవరి 14, 1983 రోజున తెలుగు సినీ అభిమానుల్ని శోక సముద్రంలో ముంచి స్వర్గస్తులయారు. అనుకరించడానికి అసాధ్యమైన ప్రత్యేకమైన శైలి రాజబాబుది. ఆయన మరణంతో తెలుగు సినిమాకు కలిగిన లోటు ఎప్పటికి తీర్చలేనిది.