లవకుశ
వికీపీడియా నుండి
లవకుశ (1963) | |
దర్శకత్వం | సి.పుల్లయ్య-సి.ఎస్.రావు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు , అంజలిదేవి , కాంతారావు, మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబహ్మణ్యం, నాగయ్య |
సంగీతం | ఘంటసాల |
నిర్మాణ సంస్థ | లలితా శివజ్యోతి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
విషయ సూచిక |
[మార్చు] తెరముందూ,వెనుకా
ఇతర తారాగణం: రమణారెడ్డి, సూర్యకాంతం, కన్నాంబ, గిరిజ, ఎస్.వరలక్ష్మి
నృత్య దర్శకత్వం: వెంపటి చినసత్యం
కళ: టి.వి.ఎస్.శర్మ
సినిమాటోగ్రఫీ: పి.ఎల్.రాయ్
కాస్ట్యూమ్స్: బి.నారాయణ మూర్తి, బి.అప్పారావు, కె.శ్రీరామ మూర్తి, ఎమ్.వి.రాజు
మేకప్ : హరిబాబు, పీతాంబరం, భక్తవత్సలం, కృష్ణ, సుధాకర్
ఎడిటింగ్: ఎ.సంజీవి
పాటలు: సముద్రాల, కొసరాజు, సదాశివబ్రహ్మం
సంగీతం: ఘంటసాల
నేపథ్యగానం: ఘంటసాల, మాధవపెద్ది,పిఠాపురం నాగేశ్వరరావు, సుశీల, లీల, జిక్కి, రాణి, కోమల, జానకి, వైదేహి, రాఘవులు, మల్లిక్
కధ: సదాశివ బ్రహ్మం
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సి.పుల్లయ్య, చి.యస్.రావు
నిర్మాత: ఎ. శంకర రెడ్డి
[మార్చు] సినిమా కధ
రామాయణం ఉత్తరకాండము ఈ సినిమా కధాంశము. సీతపై నిందలు విని రాజధర్మమునకు అనుగుణముగా ఆమెను రాముడు అవులకు పంపాడు. సీతమ్మ అప్పుడు వాల్మీకి ముని ఆశ్రమంలో కవలలను కంటుంది. వారు అసహాయశురులైన బాలురు. గానవిశారదులు. వాల్మీకి నేర్పిన రామాయణాన్ని రాముని కొలువులో గానం చేశారు. యాగాశ్వాన్ని నిలువరించి తండ్రితో యుద్దానికి తలపడ్డారు. అప్పుడు సీతమ్మ రామునకు కొడుకులనప్పగించి తాను భూప్రవేశం చేస్తుంది.
[మార్చు] 1934 కధ
మొట్టమొదట ఈస్టిండియా ఫిల్మ్ కంపెనీ బానర్ పై దేవకీబోస్ దీనిని బెంగాలీలో తీశారు. అదే స్క్రిప్టుతో ఆ కంపెనీవారే తెలుగులో తీసే బాధ్యత సి.పుల్లయ్య కు అప్పగించారు. అప్పటి డ్రామా నటులైన పారుపల్లి సుబ్బారావు రామునిగా, శ్రీరంజని సీతగా 1934లో "లవకుశ" తెలుగు తెరకెక్కింది (నలుపు-తెలుపులో). బాగా విజయవంతమైనది.
[మార్చు] 1963 కధ
మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత, 1958లో "లలితాశివజ్యోతి" బ్యానర్ పై ఇదే కధను, ఈ సారి రంగుల్లో చిత్రీకరించడం ప్రారంభించారు. దీనిని "గేవా కలర్" లో తీశారు. (తమిళంలోని "ఆలీబాబా 40 దొంగలు" దక్షిణభారతచిత్రాల్లో మొదటి రంగులచిత్రం). తమిళంలోనూ, తెలుగులోనూ "లవకుశ" సినిమాను ఒకేసారి తీశారు. కాకపోతే తెలుగు సినిమాలో పాటలెక్కువ. దాదాపు మూడొతులు అయిన తరువాత సినిమా నిర్మాణం ఆగిపోయింది. నిర్మాతకున్న ఆర్ధిక సమస్యలవల్లా, ఆర్టిస్టుల ఇతర ఒప్పందాల వల్లానూ. ఎంతో ధైర్యంతో శంకరరెడ్డి ధనం జమ చేసుకొని మళ్ళా సిద్ధమయ్యేసరికి నాలుగేళ్ళు పట్టింది. అప్పటికి సి.పుల్లయ్య ఆరోగ్యం క్షీణించింది. ఆప్పుడు డిస్ట్రిబ్యూటర్ సుందర్ లాల్ నహతా, ప్రసిద్ధ దర్శకుడు బి.ఎన్.రెడ్డి ల ప్రోత్సాహంతో సి.పుల్లయ్య కుమారుడైన సి.యస్.రావు దర్శకత్వబాధ్యత చేపట్టాడు.
అప్పటికి లవకుశులుగా వేసిన పిల్లలు కాస్త పెద్దవాళ్ళయ్యారు. సీనులు కలపడం చాలా ఇబ్బంది అయ్యింది. తమిళంలోనూ ఇదే పరిస్థితి. ఎలాగో శ్రమించి సినిమా పూర్తి చేసి 1963 లో విడుదల చేశారు. ఆ తరువాత అది పెద్ద హిట్. ఇప్పటికీ అది ఒక కళాఖండంగా నిలిచిపోయింది.
1963లో వచ్చిన ఈ "లవకుశ" తెలుగులో మొట్టమొదటి పూర్తి నిడివి రంగుల చిత్రం. (అంతకు ముందు ఒకటీ, రెండూ సీనులు రంగుల్లో తీస్తుండేవారు - ఖర్చు తగ్గించడానికి). ఎంతో వ్య ప్రయాసలకు ఓర్చి, ఒక యజ్ఙంలాగా ఈ సినిమా తీశారు. అసలే ఈ కధ ఎంతో హృద్యమైనది. ఆపైన పౌరాణికాలను తెరకెక్కించడంలో తెలుగువారికున్న నైపుణ్యంతో ఇది మనోహరమైన దృశ్యకావ్యముగా రూపు దిద్దుకుంది.
[మార్చు] హిట్ అయిన పాటలు (అన్నీనూ)
- వల్లనోరి మామా నీ పుల్లనూ
- జయము జయము
- ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ
- వినుడు వినుడు రామాయణ గాధా
ఇంకా పద్యాలూ, పాటలూ. పాటల్లాగే ఈ సినిమాలో డైలాగులు ఎంతో సున్నితంగా ఉండి ప్రేక్షకులకు గుర్తుంటాయి.
[మార్చు] విశేషాలు
- తెలుగు లవకుశులుగా వేసిన మాస్టర్ సుబ్రహ్మణ్యం, మాస్టర్ నాగరాజులు తరువాత ఒకరు వ్యవసాయంలో, ఒకరు టైలరింగ్ వృత్తిలో కాలం గడిపారు. 2006లో ఇద్దరూ యాదృచ్చికంగా కలుసుకొన్నారు - ఇది టీవీలో వార్తగా వచ్చింది.
[మార్చు] సంచలన విజయం
తెలుగులో పూర్తి రంగుల చిత్రంగా లలితాశివజ్యోతి వారి 'లవకుశ' విడుదలై నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సంచలన విజయం సాధించింది. తొలి విడతలో 26 ప్రింట్లతో విడుదలై, 26 కేంద్రాలలోనూ 150 రోజుల వరకు ప్రదర్శితమై, 14 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకొని, తొలిసారిగా 250 రోజులకు నాందీ పలికి, 470 రోజులు వరకు ప్రదర్శితమైంది 'లవకుశ'. పత్రికలలో కలెక్షన్లు ప్రకటించిన తొలి దక్షిణాది చిత్రంగా చరిత్రకెక్కి వందరోజులకు రూ. 25 లక్షలు పోగుచేసి, 365 రోజులకు కోటి రూపాయలను నాటి 25 పైసలు, రూపాయి టిక్కెట్లపై వసూలు చేసింది. ఆ నాటి రూపాయి విలువ నేటికి ఎన్నో రెట్లు పెరిగింది. ఆ కొలమానంలో చూసుకుంటే ఈ చిత్రం వసూళ్ళు నేటికీ రికార్డుగా నిలిచాయనే చెప్పాలి. అంతకు ముందున్న రికార్డుల కంటే ఈ చిత్రం మూడు, నాలుగు రెట్లు అధికంగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఆ నాడు మన రాష్ట్ర జనాభా 3 కోట్లు మాత్రమే, అయితే ఈ సినిమాను నూరు కేంద్రాలలో 1.98 కోట్ల మంది ప్రజలు ఆదరించినట్లు ఆ నాటి పత్రికా ప్రకటనలు చెబుతున్నాయి. అంటే ప్రతి కేంద్రంలోనూ ఆ యా కేంద్రాల జనాభా కంటే నాలుగు రెట్లు టిక్కెట్లు అమ్ముడై అప్పటికీ ఇప్పటికీ కనివినీ ఎరుగని చరిత్రను సొంతం చేసుకుందీ చిత్రం. (ఉదాహరణకు 1-1-1964 తేదీన వరంగల్ రాజరాజేశ్వరి థియేటర్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ఆ ఊరిలో ఆ చిత్రాన్ని 4, 34, 800 మంది చూసినట్లు ఆధారం ఉంది. ఆ నాటి వరంగల్ జనాభా ఒక లక్ష మాత్రమే). అలాగే ఆ తరువాత కూడా ఈ చిత్రం అప్రతిహతంగా నడచి అన్ని కేంద్రాలలో సంయుక్తంగా అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా నిలిచింది.
[మార్చు] వనరులు
http://www.cinegoer.com/lavakusa.htm లో వ్యాసం