తళ్ళికోట యుద్ధము
వికీపీడియా నుండి
తళ్ళికోట యుద్దం | |
---|---|
![]() యుద్దము వివరాలు తెలిపే పటము |
|
కారణము: భారతదేశ ముస్లిం దండయాత్ర | |
తేదీ: జనవరి 26, 1565 | |
స్థలము: ప్రస్తుత కర్నాటకలోని రాక్షసి-తంగిడి | |
పరిణామము: దక్కన్ సల్తనత్ల విజయము | |
ప్రత్యర్ధులు | |
విజయనగర సామ్రాజ్యము | దక్కన్ సల్తనత్లు |
సేనాధిపతులు | |
రామ రాయలు | దక్కన్ సుల్తానులు & సేనానులు |
సైనిక బలములు | |
140,000 పదాతి, 10,000 అశ్విక మరియు 100కు పైగా యుద్ధ గజములు | 80,000 పదాతి, 30,000 అశ్విక మరియు కొన్ని డజన్ల ఫిరంగులు |
ప్రాణనష్టము | |
నిర్ధిష్ట సంఖ్య తెలియదు కానీ రామ రాయలుతో సహా తీవ్ర ప్రాణ నష్టము. | నిర్ధిష్ట సంఖ్య తెలియదు కానీ ఒక మోస్తరు నుండి తీవ్ర ప్రాణ నష్టము. |
తళ్ళికోట యుద్ధము లేదా రాక్షసి తంగడి యుద్ధం (1565 జనవరి 26[1]) (జనవరి 23[2]) న విజయనగర సామ్రాజ్యమునకు, దక్కన్ సుల్తానుల కూటమికి మధ్య జరిగింది. భారత చరిత్ర గతిని మార్చిన ప్రసిద్ధ యుద్ధాల్లో ఇది ఒకటి. ఈ యుద్ధము దక్షిణ భారతదేశమున చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర పతనానికి దారితీసింది. శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఉచ్చస్థితి చేరుకున్న విజయనగర సామ్రాజ్యానికి అచ్యుత రాయల తరువాత సదాశివ రాయలు రాజయ్యాడు. అయితే సదాశివ రాయలు నామమాత్రమైన రాజు కాగా వాస్తవంలో అళియ రామరాయలు పూర్తి అధికారాలతో దైనందిన పరిపాలనను నిర్వహించాడు. రామరాయలు సమర్ధుడైన పాలకుడు.
విషయ సూచిక |
[మార్చు] యుద్ధ నేపథ్యం
ఈ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు ఒక్క సారిగా ఉత్పన్నమైనవి కావు. దశాబ్దాలుగా విజయనగరానికి, సుల్తానులకు మధ్యగల వైరం తరచు యుద్ధాలకు కారణభూతమవుతూనే ఉండేది. దాదాపు ప్రతి దశాబ్దంలోను ఒక పెద్ద యుద్ధం సంభవించింది. ముఖ్యంగా సంపదలతో తులతూగే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యన ఉన్న రాయచూరు అంతర్వేది ప్రాంతం వీరి వైరానికి కేంద్రంగా ఉండేది. 1509 నుండి 1565 వరకు విజయనగరంపై విజయం సుల్తానులకు అందని పండే అయింది. అంచేత, సహజంగానే వీజయనగరాన్ని ఓడించాలనే కాంక్ష వారిలో ఉంది.
శ్రీకృష్ణదేవరాయలు 1520 మే 19 న బిజాపూరు సుల్తాను ఇస్మాయిల్ ఆదిల్షాను చిత్తుగా ఓడించి రాయిచూరును స్వాధీనం చేసుకున్న తరువాత వీజయనగరాన్ని గెలుచుకోవాలనే కలను మర్చిపోయి, సుల్తాను తన పొరుగున ఉన్న ముస్లిము రాజ్యాలతో స్నేహ సంబంధాల కొరకు ప్రయత్నించాడు. రాయిచూరు ఓటమి దక్కను సుల్తానుల ఆలోచనలలో మార్పు తీసుకువచ్చింది. సమైక్యంగా ఉండాలనే తలంపును తీసుకువచ్చింది. [3]
ఈ సుల్తానులు ఒకరంటే ఒకరికి పడేది కాదు. అహ్మద్నగర్, బిజాపూర్ సుల్తానుల మధ్య పచ్చగడ్డి చేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. వీరి తగాదాల్లో రామరాయల సహాయం వారడగడం, రామరాయలు ఎవరో ఒకరి పక్షం వహించడం జరుగుతూ వచ్చింది. మొదట్లో నిజాంషాతో కలిసి ఆలీ ఆదిల్షాను ఓడించాడు. కొంతకాలానికే ఆదిల్షా రామరాయలుతో మైత్రి నెరపి నిజాంషాపై యుద్ధం చేసాడు. మరో సమయంలో హుసేన్ నిజాంషా, ఇబ్రహీం కుతుబ్షా కలిసి అలీ ఆదిల్షా పైకి దండెత్తినపుడు, అతడు రామరాయల సాయం కోరాడు. ఆదిల్షా, రామరాయల సంయుక్త సైన్యాన్ని కళ్యాణి వద్ద ఎదుర్కోడానికి సిద్ధపడ్డాక, సరిగ్గా యుద్ధం మొదలు పెట్టబోయే ముందు, కుతుబ్షా నిజాంషాను ఏకాకిని చేసి, తాను రామరాయలుతో చేరిపోయాడు. చేసేది లేక హుసేన్షా అహ్మద్నగర్కు పారిపోయాడు. ఒక పరస్పర నమ్మకంతో కూడిన, కాలపరీక్షకు నిలిచిన స్నేహాలు ఎవరి మధ్యనా లేవు.
సైనికపరంగా సుల్తానులపై తనది పైచేయిగా ఉండడంతో రామరాయలు వారితో చులకనగా వ్యవహరించేవాడు. తన సభలో వారి రాయబారులకు తగు గౌరవం ఇవ్వకపోవడం వంటివి చేసేవాడు. చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు కలిగిన ఒక విషయం ఉంది - వారి ప్రాంతాలను ఆక్రమించుకున్నపుడు ముస్లిము మతాచారాలను రామరాయలు అవమానించేవాడు. అయితే ఇది సరికాదనీ, రామరాయల వద్ద అనేకులు ముస్లిములు పనిచేసేవారనీ, అతడు వారి కొరకు ప్రత్యేకంగా నివాసస్థలాలు, ప్రార్థనా స్థలాలు కట్టించి ఇచ్చాడనీ కొందరు చరిత్రకారులు అంటారు.
విజయనగర సామ్రాజ్యం చాలా విశాలమైనది, సంపదలతో తులతూగుచున్నది, చాలా పెద్ద సైనిక సంపత్తి కలిగినది. ఇంతటి బృహత్తరమైన సామ్రాజ్యాన్ని జయించగలిగే శక్తి ఏ ఒక్క ముస్లిము రాజ్యానికీ లేదు. అందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడితేనే ఇది సాధ్యపడుతుంది. ఈ కూటమి ఏర్పాటుకు ఆదిల్షా పూనుకోవాలని అతని సన్నిహితులు, సలహాదారులు అతడికి చెప్పారు. గమనించవలసిన విషయం ఏమిటంటే ఆ సమయానికి ఆలీ ఆదిల్షాకు, రామరాయలకు మధ్య మైత్రి ఉన్నది. అయినప్పటికీ అతడు గోల్కొండ సుల్తాను ఇబ్రహీం కుతుబ్షా తో మంతనాలు మొదలుపెట్టాడు. ఇబ్రహీం దానికి ఒప్పుకోవడమే కాక, ఆదిల్షా బద్ధ విరోధియైన అహ్మద్నగర్ సుల్తానుతో రాయబారం కూడా నడిపి వారిద్దరికీ సంధి కుదిర్చాడు. ఈ సంధిలో భాగంగా హుసేన్షా కూతురును ఆలీ ఆదిల్షా పెళ్ళి చేసుకోగా, ఆలీ ఆదిల్షా చెల్లెలిని హుసేన్షా కొడుకు పెళ్ళి చేసుకున్నాడు.
ఇక రామరాయలతో చెలిమిని ఆలీ ఆదిల్షా తుంచుకోవడమే తరువాయి. ఈ ఎత్తుగడతో, తనవద్దనుండి తీసుకున్న కొన్ని ప్రాంతాలను తిరిగి ఇచ్చివేయవలసిందిగా కోరుతూ ఒక రాయబారిని పంపాడు. సహజంగానే రామరాయలు ఆ రాయబారాన్ని తిరస్కరించాడు. యుద్ధం మొదలు పెట్టేందుకు నేపథ్యంతో పాటు ఒక కారణం కూడా సమకూడింది.
[మార్చు] యుద్ధ భూమి
ఈ యుద్ధం రాక్షసి, తంగడి అనే రెండు గ్రామాల మధ్య జరిగిందనీ, కాదు తళ్ళికోట వద్ద జరిగిందని రెండు వాదనలు ఉన్నాయి. అయితే ఈ రేండూ కాదని మరో రెండు వాదనలు ఉన్నాయి. సాంప్రదాయక హిందూ రచనలు, మూలాలు యుద్ధము రాక్షసి తంగడి వద్ద జరిగిందని. ఫరిస్తా మొదలగు ముస్లిం చారిత్రికులు తళ్లికోట వద్ద జరిగిందని అభిప్రాయపడ్డారు.
- మూడో వాదన
- విజయనగర సైన్యం రాక్షసి, తంగడి అనే రెండు గ్రామాల మధ్య మైదానంలో విడిది చేసింది. సుల్తానుల సమైక్య సైన్యం తళ్ళికోట అనే గ్రామం వద్ద విడిది చేసింది. యుద్ధం మాత్రం ఈ రెండు ప్రాంతాల మధ్య గల బన్నిహట్టి అనే ప్రదేశంలో జరిగింది.[4]
- రాబర్ట్ సెవెల్ అభిప్రాయం
- తళ్ళికోట కృష్ణకు ఉత్తరాన 25 మైళ్ళు ఉత్తరాన ఉన్నది. కాని యుద్ధం జరిగింది, కృష్ణకు దక్షిణాన. ఇంగలిగి గ్రామం నుండి ముద్కల్ పోయే దారిలో భోగాపూర్ అనే గ్రామం వద్ద జరిగి ఉండవచ్చు.
[మార్చు] యుద్ధ వివరణ
నలుగురు సుల్తానుల సైన్యాలు బిజాపూరు సమీపంలోని మైదాన ప్రాంతంలో కలిసాయి. 1564 డిసెంబర్ 25 న కూటమి సైన్యాలు దక్షిణ ముఖంగా ప్రయాణించి కృష్ణకు 25 మైళ్ళ దూరంలోని తళ్ళికోట గ్రామం వద్దకు చేరాయి. సైన్యాలు అక్కడ చాలా రోజుల పాటు విడిది చేసాయి.
రామరాయలు కూడా యుద్ధ సన్నాహాలు చేసాడు. తన తమ్ముళ్ళు తిరుమల, వెంకటాద్రిల సమేతంగా కృష్ణకు దక్షిణ భాగాన రాక్షసి, తంగడి గ్రామాల మధ్యన మోహరించాడు. సుల్తాను సైన్యం నదిని దాటే అవకాశం గల చోట్ల కాపలాను ఏర్పాటు చేసాడు.
సుల్తానులు నది దిగువగు ప్రయాణం చేస్తున్నట్లుగా రాయల సైన్యాన్ని బొల్తా కొట్టించి, ఒకరాత్రి వేళ నదిని దాటి దక్షిణానికి చేరాయి. తెల్లవారేసరికి సైన్యమంతా దక్షిణ తీరానికి చేరుకుంది. ఆ మరుసటి రోజున - 1565 జనవరి 23 (ఫరిష్తా యుద్ధం జరిగిన తేదీని జనవరి 23 గా గుర్తించాడు. రాబర్ట్ సెవెల్ కూడా తన పుస్తకంలో అదే తేదీని తీసుకున్నాడు.) - రెండు పక్షాల సైన్యాలు ఎదురుపడ్డాయి. రెండు వైపులా సైన్యం లక్షల్లో ఉంది. రామరాయలు సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించాడు. ఎడమ వైపున తిరుమల రాయలు ఆలీ ఆదిల్షాను, మధ్యన రామరాయలు హుసేన్ నిజాంషాను, కుడివైపున వెంకటాద్రి రాయలు ఇబ్రహీం కుతుబ్షా, ఆలీ బరీద్లను ఎదుర్కొన్నారు. కూటమి సైన్యం ఫిరంగులను మోహరించింది. ఈ ఫిరంగులను కప్పిపుచ్చుతూ రెండువేలమంది సైనికులు విజయనగర సైన్యంపై బాణాల వర్షం కురిపించారు. విజయనగర సైన్యం వీరిపైకి దాడి చేసే సమయానికి వీరు లాఘవంగా తప్పుకుని ఫిరంగులకు దారినిచ్చారు. విజయనగర సైన్యం సరిగ్గా ఫిరంగులకు ఎదురుగా వచ్చింది. హఠాత్తుగా మొదలైన ఫిరంగి దాడులతో సైన్యం వెనకడుగు వేసింది.
పల్లకీ ఎక్కి పర్యవేక్షిస్తున్న రామరాయలు పల్లకీ దిగి ఒక ఎత్తైన సింహాసనమెక్కి బంగారు నాణేలు విరజిమ్ముతూ సైన్యాన్ని ఉత్సాహపరచాడు. విజయనగర సైన్యం కూడా కూటమి సైన్యంపై దాడులు చేసి బాగా నష్టం కలిగించడంతో రెండువైపులలోని కూటమి సైన్యం వెనక్కు తగ్గింది. మధ్య భాగం లోని కూటమి సైన్యం ఫిరంగులలో రాగి నాణేలను కూరి విజయనగర సైన్యంపై పేల్చింది. ఈ దాడికి వేలాది సైనికులు బలయ్యారు. సైన్యం చెల్లాచెదురయింది. ఈ హడావుడిలో రామరాయలు గద్దె దిగి, మళ్ళీ పల్లకి ఎక్కబోయాడు. సరిగ్గా అదే సమయానికి ఫిరంగుల మోతలకు బెదిరిన కూటమి సైన్యంలోని ఓ ఏనుగు పరిగెత్తుకుంటూ రాయల పల్లకీ వైపు వచ్చింది. అదిచూసి భయపడిన బోయీలు పల్లకిని వదిలేసి పరుగెత్తారు. కిందపడిపోయిన రాయలు తేరుకుని లేచి గుర్రమెక్కేలోగా హుసేన్ నిజాం షా సైన్యం పట్టుకుని బంధించి, సుల్తాను ముందు హాజరు పరచింది. హుసేన్షా స్వయంగా రామరాయల తల నరికి యుద్ధభూమిలో పైకెత్తి ప్రదర్శించాడు.
తమ రాజు మరణం చూసిన విజయనగర సైన్యం దిక్కుతోచని స్థితిలో పరుగులు తీసింది. కూటమి సైన్యం వారిని వెంటాడి హతమార్చింది. కనీసమాత్రపు ఆత్మరక్షణను కూడా ఆలోచించే పరిస్థితిలో లేని సైన్యం చెల్లాచెదురైంది. వెంకటాద్రి రాయలు మరణించాడు. తిరుమలరాయలు ఒక కన్ను కోల్పోయి వెనక్కు నగరానికి పారిపోయాడు.
[మార్చు] పర్యవసానాలు
[మార్చు] మూలాలు, వనరులు
- రామరాయలు, తళ్ళికోట యుద్ధం
- ^ విస్మృత సామ్రాజ్యం - రాబర్ట్ సెవెల్ రచన
- ^ 1565 వరకు ఆంధ్రుల చరిత్ర- జె.దుర్గా ప్రసాదు
- ^ ఈ తేదీ ఇంగ్లీషు వికీపీడియా నుండి స్వీకరించబడింది.
- ^ యుద్ధం జరిగిన తేదీ జనవరి 23 గా రాబర్ట్ సెవెల్ తన విస్మృత సామ్రాజ్యం పుస్తకంలో రాసాడు. ఆ పుస్తకంలో రిఫరెన్సు 327 వద్ద అలా ఎందుకు తీసుకున్నాడో కూడా రాసాడు.