రైతుబిడ్డ (1939 సినిమా)
వికీపీడియా నుండి
1971 లో వచ్చిన ఇదేపేరుగల మరొక సినిమా వివరాలకోసం రైతుబిడ్డ చూడండి.
రైతుబిడ్డ (1939) | |
అప్పటి సినిమాపోస్టరు [1] |
|
---|---|
దర్శకత్వం | గూడవల్లి రామబ్రహ్మం |
నిర్మాణం | గూడవల్లి రామబ్రహ్మం, చల్లపల్లి రాజా |
కథ | గూడవల్లి రామబ్రహ్మం |
తారాగణం | బళ్లారి రాఘవ, జి.వి.సీతాపతి, టంగుటూరి సూర్యకుమారి, గిడుగు వెంకట సీతాపతిరావు, నెల్లూరు నాగరాజారావు, భీమవరపు నరసింహారావు, పద్మావతీదేవి, సుందరమ్మ, వంగర, సూరిబాబు, కొసరాజు, వేదాంతం రాఘవయ్య |
సంగీతం | భీమవరపు నరసింహారావు |
గీతరచన | బసవరాజు అప్పారావు, కొసరాజు, నెల్లూరు వెంకట్రామ నాయుడు, తాపీ ధర్మారావు, తుమ్మల సీతారామమూర్తి |
సంభాషణలు | త్రిపురనేని గోపీచంద్, మల్లాది విశ్వనాధ కవిరాజు |
ఛాయాగ్రహణం | శైలేన్ బోస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమాకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. నిషేధింపబడిన మొదటి తెలుగు సినిమా ఇది.
మాలపిల్ల తర్వాత జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతుబిడ్డ తీసి రామబ్రహ్మం తన సాహస ప్రవృత్తిని మళ్ళీ చాటుకున్నాడు. 1925 లో ఆవిర్భవించిన ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం ఛత్రం క్రింద జాగృతులైన సన్నకారు రైతులు తమ హక్కుల సాధనకు నడుం కట్టారు. 1937లో మద్రాసులో కాంగ్రెసు ప్రభుత్వం నియమించిన కమిటీ ఒకటి భూమికి యజమాని రైతేనని తీర్మానించింది. ఈ చారిత్రక నేపథ్యంలో రామబ్రహ్మం రైతుబిడ్డను నిర్మించాడు.
ఈ సినిమాకు రామబ్రహ్మం స్వయంగా కథ సమకూర్చగా త్రిపురనేని గోపీచంద్ మాటలు వ్రాశాడు. కొసరాజు పాటలు వ్రాయగా, జమీన్ రైతు ఉద్యమంలో నెల్లూరు వెంకట్రామనాయుడు వ్రాసిన గీతాలను కూడా ఈ సినిమాలో వాడుకున్నారు. సంగీత దర్శకుడు బి.నరసింహారావు. చిత్రానికి నృత్య దర్శకుడు వేదాంతం రాఘవయ్య. నట వర్గం: బళ్ళారి రాఘవాచార్య, గిడుగు, పి. సూరిబాబు, నెల్లూరు నగరాజారావు, టంగుటూరి సూర్యకుమారి, శ్. వరలక్ష్మి ఎత్చ్. '39 లో చిత్రం విడుదల గావటనికి ముందు చాలా అవాంతరాలు కలిగించపడ్డాయి. పేర్కొనదగ్గ విషయమేమంటే "సారధి" సంస్థ యజమాని యార్లగడ్డ శివరామప్రసాద్ (చల్లపల్లి జమిందారు). జమిందారీ విధానం మీద, పెత్తనాల మీదా ఒక జమిందారే చిత్రం నిర్మించడం గొప్ప విషయం.
ఈ సినిమాకు వ్యతిరేకత సనాతన వర్గాలకంటే బలంగా జమీందార్ల నుంచి ఎదురైంది. మాలపిల్లను ప్రభుత్వం నిషేధించలేదు. కానీ జమీందార్లు రైతుబిడ్డ సిన్మాను ప్రభుత్వం చేత నిషేధింపజేయగలిగారు. ఇంకో విచిత్రమేమిటంటే జమీందార్ల ఘాతుకాలను నిరసించిన ఈ సినిమాను నిర్మించినది ఒక జమీందారు. ఈ చిత్ర నిర్మాత అయిన చల్లపల్లి రాజా జమీందార్ల పార్టీ అయిన జస్టిస్ పార్టీలో ఒక వర్గానికి నాయకుడు. పార్టీ లో ఆయన ప్రత్యర్థి వర్గానికి నాయకుడైన మీర్జాపురం రాజా ఈ చిత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, తిరోగమన ధోరణిలో అనేక జానపద, పౌరాణిక చిత్రాలను నిర్మించాడు.
రైతుబిడ్డ చిత్రాన్ని జమీందార్ల ఒత్తిడిపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించినా ఆ చిత్రం ప్రతిబింబించిన స్ఫూర్తి కాలక్రమంలో విజయం సాధించింది. 1955లో విడుదలై ఘనవిజయం సాధించిన రోజులు మారాయి చిత్రాన్ని రైతుబిడ్డకు కొనసాగింపు అనుకోవచ్చు. కులవ్యవస్థ నిర్మూలన సందేశం ఇవ్వడం కోసం కూడా రామబ్రహ్మం నడుం కట్టాడు. పల్నాటి బ్రహ్మనాయుడు పాత్ర ద్వారా ఈ సందేశాన్ని ఇవ్వడానికి పల్నాటి యుద్ధం సినిమా తీశాడు. 1939 అక్టోబర్లో టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసు అసెంబ్లీలో ప్రవేశబెట్టబోయే "ప్రకాశం బిల్లు"కు ప్రచారంగా ఈ చిత్రం తోడ్పడింది. అలాగే జరగబోయే జిల్లాబోర్డు ఎన్నికల్లో జమీందారులకు వ్యతిరేక ప్రచారంలో కూడా ఉపయోగపడింది.
విడుదలకు సిధ్ధంగా వున్న చిత్రాన్ని నిషేధించటనికి వెంకటగిరి, బొబ్బిలి జమీందారులు నోటీసులు ఇచ్చారు. విడుదల రోజునే (ఆగస్టు 27, 1939) వాళ్ల లాయర్లు నెల్లూరు వచ్చి, చిత్రాన్ని చూసి నోట్సు వ్రాసుకొని వెళ్ళారు. అలాగే నిర్మాతలకు రిజిష్టర్డ్ నోటీసులు పంపటం, వారి ఎస్టేటులలో ప్రదర్శిస్తే - సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకొంటామని బెదరించటం జరిగింది. చివరకు నెల్లూరు జిల్లా మేజిస్ట్రేట్ ద్వారా వెంకటగిరి పట్టణం లోనే కాదు, తాలూకా లోనే కాదు పూర్తి గూడూరు డివిసిఒన్ లోనే చిత్రాన్ని నిషేధించ గలిగారు. సెన్సారుబోర్డు సంఫుర్ణంగా నిషేధించలేదు కాబట్టి వారిపై కూడా ఒత్తిడి తీసుకొని రావడం జరిగింది. కాని అక్కడ జమీందారుల ఆటలు కొనసాగలేదు. మేజిస్ట్రేట్ చర్య న్యాయ బధ్ధం కానప్పటికి మద్రాసు ప్రభుత్వం కూడా చూసి చూడనట్లు ప్రవర్తించటం గమనార్హం. ఇలా జమీందార్ల అక్రమాలకు వంతపాడటం ప్రజలకు ఆగ్రహాన్ని కలిగించింది. విడుదలకు తరువాత నిషేధించాలన్న ప్రయత్నాల్లు మరింత తీవ్రమయ్యాయి. కొన్ని చోట్ల ఫిల్మ్ ప్రింటులు దగ్ధం చేయాలన్న ప్రయత్నాలు కూడా జరిగాయి. చిత్రంలోని కొన్ని పాత్రలు తమ వ్యక్తిత్వం మీద దెబ్బతీసే పధ్ధతిలో వున్నాయని బొబ్బిలి, వెంకటగిరి రాజాలు చిత్ర నిర్మాతల మీద దావా తెచ్చారు. మొత్తానికి కొంతకాలం కొన్ని జిల్లాలలో నిషేధించబడింది (నిర్మించిన చల్లపల్లి రాజాగారి కృష్ణా జిల్లాలో కూడా).
సినిమాలు ప్రజలమీద ఒత్తిడి తీసుకురాగలవన్న నమ్మకం మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాలతోనే ఆరంభమైంది. ఎంత సంచలనం రేపగలిగినా అనేక అవాంతరాలవల్ల "మాలపిల్ల" లాగా ఆర్ధికవిజయం సాధించలేకపోయింది. నిషేధాలు, కోర్టులు, బెదిరింపులు, ఆర్ధికనష్టంవంటివన్నీ రావటంతో ఎంత సాంఘిక చైతన్యంగల మనిషయినా రామబ్రహంగారు మరల అలాంటి ప్రయత్నం చెయ్యలేక పోయారు.