టంగుటూరి ప్రకాశం పంతులు
వికీపీడియా నుండి
నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు (Tanguturi prakasam Pantulu). 1940, 50 లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించిన వారిలో ప్రకాశం ఒకడు.
విషయ సూచిక |
[మార్చు] బాల్యం, చదువు
టంగుటూరి ప్రకాశం పంతులు 1872 ఆగష్టు 23 న ఇప్పటి ప్రకాశం జిల్లా కనపర్తి గ్రామంలో జన్మించాడు. ఆరుగురు పిల్లల్లో ప్రకాశం ఒకడు. వల్లూరులో ప్రాథమిక విద్య సాగింది. ఆ వయసులో అల్లరిగా తిరిగేవాడు. ఆయన పదకొండోయేట తండ్రి మరణించడంతో, పిల్లలను తీసుకుని తల్లి ఒంగోలు చేరింది. పూటకూళ్ళ వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక ప్రకాశం ధనికుల ఇళ్ళల్లో వారాలకు కుదిరాడు. మిషను పాఠశాల ఉపాధ్యాయుడైన ఇమ్మనేని హనుమంతరావు నాయుడు చలవతో ప్రకాశం ఫీజు లేకుండా ప్రి మెట్రిక్ లో చదివాడు.
నాయుడు రాజమండ్రికి నివాసం మారుస్తూ ప్రకాశంను తనతో తీసుకువెళ్ళి, అక్కడ ఎఫ్.ఏ. లో చేర్పించాడు. తరువాత మద్రాసుకు పంపించి, న్యాయశాస్త్రం చదివించాడు. 1890 లో పెళ్ళి చేసుకున్నాడు. తరువాత కొద్దికాలం ఒంగోలు లో న్యాయవాద వృత్తి చేసి, 1894 లో మళ్ళీ రాజమండ్రి చేరాడు. వృత్తిలో బాగా పేరూ, సంపదా సంపాదించాడు. తన 35వ ఏట, రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యాడు.
1901 లో లండన్ వెళ్ళి బారిస్టరు చదివాడు. తిరిగివచ్చాక, 1907 లో మద్రాసులో ప్రాక్టీసు పెట్టాడు. 1921లో వృత్తిని వదలిపెట్టేనాటికి, లక్షల్లో సంపాదించాడు. 1921 లో స్వాతంత్ర్య సమరంలో అడుగుపెట్టి తన యావదాస్తినీ, దేశసేవకే ఖర్చు చేసాడు.
[మార్చు] రాజకీయ జీవితం
1921 లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1921 అక్టోబర్ 29 న స్వరాజ్య అనే దినపత్రికను ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే, ఈ పత్రిక మంచి ఆదరణ చూరగొన్నది. దీని తెలుగు, తమిళ సంచికలకు ప్రజలు ఎగబడ్డారు. 1928 లో మద్రాసులో సైమన్ కమిషను బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని, తుపాకికి ఎదురు నిలిచి, కాల్చమని సవాలు చేసాడు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనను ఆంధ్ర కేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారు.
1937 లో కాంగ్రెసు అధికారంలోకి వచ్చినపుడు, రాజాజీ మంత్రివర్గంలో ఆయన రెవిన్యూమంత్రి అయ్యాడు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. 1946 లో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై 13 నెలలపాటు ఆ పదవిలో కొనసాగాడు. ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాడు. స్వంతపార్టీలోని అంతర్గత రాజకీయాలకు ఆయన ప్రభుత్వం బలయ్యాక, పార్టీ నుండి బయటకు వచ్చి, స్వంతంగా ప్రజాపార్టీ ని స్థాపించాడు.
1953 అక్టోబర్ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. ఆయన పాలనా కాలంలో ప్రముఖ సంఘటనలెన్నో జరిగాయి. రాష్ట్రావతరణ మొదటి వార్షికోత్సవాన 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, విజయవాడ వద్ద కృష్ణా నదిపై బారేజి నిర్మాణం వీటిలో ప్రముఖమైనవి.
ముఖ్యమంత్రి అయిన 14 నెలలకే అవిశ్వాస తీర్మానంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. 1957 మే 20 న హైదరాబాదు లో ఆయన మరణించాడు.
టంగుటూరి ప్రకాశం పంతులు జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్ 5 న ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు.
[మార్చు] ప్రకాశం గురించి ప్రముఖులు
- "గాలితోనైనా పోట్లాడే స్వభావం కలవాడు ప్రకాశం" _అయ్యదేవర కాళేశ్వరరావు
- "ప్రమాదములున్నచోటే ప్రకాశంగారుంటారు" _భోగరాజు పట్టాభి సీతారామయ్య
[మార్చు] మూలాలు
- అమరావతి పబ్లికేషన్సు వారి తెలుగు వెలుగులు పుస్తకం
- జానమద్ది హనుమచ్ఛాస్త్రి రచించిన సుప్రసిద్ధుల జీవిత విశేషాలు
[మార్చు] బయటి లింకులు
ఇంతకు ముందు ఉన్నవారు: --- |
ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి 01/10/1953—15/11/1954 |
తరువాత వచ్చినవారు: బెజవాడ గోపాలరెడ్డి |