కుతుబ్ షాహీ వంశము
వికీపీడియా నుండి
కుతుబ్ షాహీ వంశము (ఈ వంశస్థులను కుతుబ్ షాహీలు అందురు) దక్షిణ భారతదేశము లోని గోల్కొండ రాజ్యము యొక్క పాలక వంశము. ఈ వంశస్థులు తుర్కమేనిస్తాన్-ఆర్మేనియా ప్రాంతములోని తుర్కమేన్ తెగకు చెందిన షియా ముస్లింలు.
విషయ సూచిక |
[మార్చు] స్థాపన
కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్, 16వ శతాబ్దము ప్రారంభములో కొందరు బంధువులు మరియు స్నేహితులతో కలసి ఢిల్లీకి వలస వచ్చాడు. తరువాత దక్షిణాన దక్కన్ పీఠభూమికి వచ్చి బహుమనీ సుల్తాన్ మహమ్మద్ షా కొలువులో పనిచేసినాడు. అతడు గోల్కొండను జయించి తెలంగాణ రాజ్యానికి అధిపతి అయ్యెను. 1518లో బహుమనీ సామ్రాజ్యము పతనమై ఐదు దక్కన్ సుల్తానేట్లు ఆవిర్భవించుచున్న సమయములో బహుమనీ సుల్తానుల నుండి స్వతంత్రము ప్రకటించుకొని, "కుతుబ్ షా" అనే పట్టము స్వీకరించి గోల్కొండ కుతుబ్ షాహీ వంశమును స్థాపించినాడు.
[మార్చు] పరిపాలన
ఈ వంశము తెలుగు వారిని పరిపాలించిన తొలి ముస్లిం వంశము. ఇది అంధ్ర దేశమును ముస్లింలు పరిపాలిచిన (తెలంగాణ ప్రాంతము) మరియు హిందూ పరిపాలనలో ఉన్న ఇతర ప్రాంతములుగా విభజించినది. ఈ వంశము 1687 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు యొక్క సైన్యాలు దక్కన్ని జయించేవరకు, 171 సంవత్సరాలు గోల్కొండను పరిపాలించినది. ఆ తరువాత కూడా, తెలంగాణ 1948లో హైదరాబాదు రాజ్యము, న్యూఢిల్లీ యొక్క సైనిక జోక్యం (పోలీసు చర్య) తో భారత దేశము లో విలీనము అయ్యేవరకు ముస్లింల పరిపాలనలోనే ఉన్నది.
కుతుబ్ షాహీ పాలకులు గొప్ప కళా మరియు శాస్త్ర పోషకులు. వీరు పర్షియన్ సంస్కృతిని పోషించడమే కాకుండా, ప్రాంతీయ దక్కన్ సంస్కృతికి చిహ్నమైన తెలుగు భాష మరియు కొత్తగా అభివృద్ధి చెందిన ఉర్దూ(దక్కనీ) ను కూడా పోషించారు. తెలుగు ప్రాంతమైన తెలంగాణ గోల్కొండ రాజ్యములో ఒక ప్రముఖ భాగమైనందున, వాళ్ల మాతృ భాష కాకపోయినా, గోల్కొండ పాలకులు తెలుగు భాష అభ్యసించారు. గోల్కొండ, ఆ తరువాత హైదరాబాదు రాజ్యమునకు రాజధానులుగా ఉండేవి మరియు ఉభయ నగరములును కుతుబ్ షాహీ సుల్తానులే అభివృద్ధి చేశారు.
[మార్చు] వంశ క్రమము
ఈ వంశము యొక్క ఎనిమిది రాజులు క్రమముగా:
- సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ (1518-1543)
- జంషీద్ కులీ కుతుబ్ షా (1543-1550)
- సుభాన్ కులీ కుతుబ్ షా (1550)
- ఇబ్రహీం కులీ కుతుబ్ షా (1550-1580)
- మహమ్మద్ కులీ కుతుబ్ షా (1580-1612)
- సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా (1612-1626)
- అబ్దుల్లా కుతుబ్ షా (1626-1672)
- అబుల్ హసన్ కుతుబ్ షా (1672-1687)