రవీంద్రనాధ టాగూరు
వికీపీడియా నుండి
భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ టాగోర్. టాగోరు గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు.
విషయ సూచిక |
[మార్చు] బాల్యము, విద్యాభ్యాసము
వంగదేశంలో 1861 మే 7వ తేదీన దేవేంద్రనాథ ఠాగూరు, శారదాదేవీలకు పద్నాలుగవ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించాడు. ఇతని బాల్యం చాలా చోద్యంగా గడిచింది. ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆవలిస్తూ కునికిపాట్లు పడుతూ చదివేవాడు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి పోయి ప్రకృతి సౌందర్యాన్ని చూచి ఆనందించేవాడు. కథలంటే చెవి కోసుకొనేవాడు. సామాన్య దుస్తులతో, నిరాడంబరంగా పెరిగాడు. బాల్యంలో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండవలసి రావటంతో ఆయనకు బయటి ప్రపంచం అద్భుతంగా తోచేది. ప్రపంచమొక రహస్యమనీ, ఆ రహస్యాన్ని తెలుసు కోవాలనీ కుతూహలపడేవాడు.
రవీంద్రుడు పాఠశాలలో చదవడానికి ఇష్టపడక ఇంటివద్దనే క్రమశిక్షణతో ప్రతి ఉదయం వ్యాయామం చేసి, లెక్కలు చేసి, చరిత్ర, భూగోళ పాఠాలను, సాయంత్రం చిత్రలేఖనం, ఆటలు, ఇంగ్లీషు అభ్యసించేవాడు.ఆదివారాలలో సంగీత పాఠాలు, భౌతిక శాస్త్రం ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం నేర్చుకొనేవాడు. బొమ్మలున్న ఆంగ్ల నవలలను స్వయంగా చెదివేవాడు. కాళిదాసు, షేక్స్పియరు రచనలు చదివాడు. భాషను క్షుణ్ణంగా అభ్యసించి మాతృభాష పట్ల అభిమానం పెంచుకొన్నాడు.
రవీంద్రుడు ఇంగ్లాండులో ఒక పబ్లిక్ స్కూలులో చేరి, ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు విని ఆంగ్ల సాహిత్యంపై అభిరుచి పొంచుకొన్నాడు. సాహితీపరుల ప్రసంగాలు విని వారితో సంభాషించి నాటకాలకు, సంగీత కచేరీలకు వెళ్ళ, ఆంగ్ల సంస్కృతీ సంప్రదాయాలు బాగా ఆకళించుకొన్నాడు. తన అనుభవాలను భారతికి లేఖలుగా వ్రాసేవాడు. రవీంద్రుడు ఇంగ్లండులో వుండగానే భగ్న హృదహం అనే కావ్యాన్ని రచించాడు. అయితే ఇంగ్లండులో పద్దెనిమిది మాసాలు వుండి ఏ డిగ్రీనీ సంపాదించకుండానే స్వదేశానికి తిరిగి వచ్చాడు.
[మార్చు] సాహితీ వ్యాసంగం
రవీంద్రుడు బాల్యంలోనే అనేక పద్యాలు, వ్యాసాలు, విమర్శలు ప్రచురించాడు. ఆయన రచించిన సంధ్యాగీత్ కావ్యాన్ని కవులందరూ మెచ్చుకొనేవారు. వందేమాతరం గీతాన్ని రచించిన బకించంద్ర చటర్జీ కూడా రవీంద్రుని ప్రశంసించాడు. రవీంద్రుడు రచించిన భక్తిగీతాలను తండ్రి విని, వాటి ప్రచురణ కవసరమయిన డబ్బు ఇచ్చేవాడు. ఆ తరువాత రవీంద్రుడు విర్గరేర్ స్వప్న భంగ, ప్రభాత సంగీత అనే కావ్యాలను రచించాడు.
[మార్చు] గీతాంజలి
రవీంద్రుని రచనలలో గీతాంజలి చాల గొప్పది. రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తిగీతాలను కొన్నింటిని ఆంగ్లంలోనికి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టాడు. అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది. ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. 1913 వ సంవంత్సరంలో సాహిత్యానికి సంబంధించి రవీంద్రుని గీతాంజలికే నోబెల్ బహుమతి లభించింది. విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది. ఆసియా ఖండంలో మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి. గీతాంజలి వెలువడిన తరువాత అన్ని దేశాలవారు రవీంద్రుని గ్రంథాలను చదవడం ఆరంభించారు.
[మార్చు] శాంతి నికేతన్
రవీంద్రుడు కేవలం రచయితగానే ఉండిపోక, బాలల హృదయాలను వికసింపచేయటానికై ప్రాచీన మునుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అది అయిదుగురు విద్యార్థులతో మొదలై, క్రమంగా విస్తరించింది. చిన్న పిల్లలు ఉపాధ్యాయుల ఇళ్ళల్లో భోజనం చేసేవారు. ప్రాతఃకాలానే నిద్ర లేవడం, కాలకృత్యాలు తీర్చుకొని, తమ గదులను తామే శుభ్రపరచుకొని స్నానం చేయడం, ప్రార్థన చేయటం, నియమిత వేళలలో నిద్ర పోవటం వారి దినచర్య. ఆరోగ్యం కాపాడుకోవటం, పరిశుభ్ర్హత, సత్యాన్నే పలుకుట, కాలినడక, పెద్దలను, గురువులను గౌరవించటం వారికి నేర్పేవారు.
[మార్చు] నవల,నాటకాలు
గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని రవీంద్రుడు భావించాడు. అందుకై శ్రీ నికేతాన్ని నెలకొల్పి, గ్రామ పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేసేవాడు. రవీంద్రుడు మొదట వాల్మీకి ప్రతిభ అనే నాటకాన్ని రచించాడు. ఆ తరువాత అమల్ అనే పిల్లవాణ్ణి గురించి పోస్టాఫీసు అనే నాటకం వ్రాశాడు. రవీంద్రుడు రచించిన చిత్రాంగద నాటకం ఆయనకు మంచిపేరు తెచ్చింది. ప్రకృతి - ప్రతీక అనే నాటకంలో ప్రపంచాన్ని విడిచి పెట్టిన సన్యాసి కథను వర్ణించాడు. రవీంద్రుడు కచదేవయాని, విసర్జన, శరదోత్సవ్, ముక్తధార, నటిర్పూజ మొదలగు అనేక శ్రేష్టమయిన నాటకాలు రచించాడు. మతాలు వేరైనా పరస్పర స్నేహంతో కలసి మెలసి ఉండాలి అనే సాంఘిక ప్రయోజనం, ఉత్తమ సందేశం మిళితమైన 'గోరా' నవల రవీంద్రునికెంతో పేరు తెచ్చింది.
[మార్చు] చిత్రకళ, సంగీతం
రవీంద్రనాధ టాగోరు డెబ్భై ఏళ్ళ ప్రాయంలో చిత్రకళా రచన ప్రారంభించాడు. ఆయన వేసిన చిత్రాలు లండను, ప్యారిస్, న్యూయార్కు మొదలగు నగరాలలో ప్రదర్శించబడ్డాయి. ఆయన దాదాపు రెండు వేల చిత్రాలను గీశాడు.
రవీంద్రుడికి సంగీతమంటే మిక్కిలి ప్రీతి. ఆయన బెంగాల్ జానపద గీతాలను, బాపుల్ కీర్తనలను విని ముగ్ధుడయ్యేవాడు. ఆయన స్వయంగా గాయకుడు. భారతీయ సంగీతంలో రవీంద్ర సంగీతం అనే ప్రత్యేక శాఖ నేర్పర్చిన వాడు రవీంద్రుడు.
[మార్చు] స్వాతంత్ర్య సాధన,జనగణమణ
రవీంద్రుడు మొదటి నుండి జాతీయ భావాలున్న వాడు. హిందూ మేళాలో దేశభక్తి గీతాలను పాడాడు. పృధ్విరాజు పరాజయం గురుంచి ప్రబోధాత్మక పద్యనాటకాన్ని రచించాడు. బ్రిటీష్ ప్రభుత్వం తిలక్ను నిర్భంధించినపుడు రవీంద్రుడు తీవ్రంగా విమర్శించాడు. బెంగాల్ విభజన ప్రతిఘటనోద్యమంలో రవీంద్రుడు ప్రముఖపాత్ర వహించాడు. జాతీయ నిధికి విరాళాలు వసూలు చేశాడు. రవీంద్రనాథ టాగోర్ 1896 లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులులో మొట్టమొదటిగా బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరాన్ని ఆలపించాడు. రవీంద్రుడు వ్రాసిన ' జనగణమణ ' ను జాతీయ గీతంగా ప్రకటించేముందు వందేమాతరం, జనగణమణ లపై దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని సుధీర్ఘ చర్చ, తర్జన భర్జనలు జరిగాయి. అంతిమంగా రవీంద్రుడి ' జనగణమణ ' దే పైచేయి అయింది. దీంతో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న జనగణమణ ను జాతీయ గీతంగా వందేమాతరం ను జాతీయ గేయంగా ప్రకటించాడు. అదేసమయంలో రెండూ సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని స్పస్టంచేసాడు.
[మార్చు] గాంధీ మెచ్చిన రవీంద్ర హృదయం
గీతాంజలి రవీంద్రునికి కవిగా ప్రపంచఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ కావ్యంలోని ఈ కింది గీతం మహాత్మాగాంధీకి మిక్కిలి అభిమాన పాత్రమైంది.
ఈ మంత్రములు జపమాలలు విడిచిపెట్టు
తలుపులన్నింటినీ బంధించి,
ఈ చీకటిగదిలో ఎవరిని పూజిస్తున్నావు?
కళ్ళు తెరచి చూడు.
నీవు ఆరాధించే దేవుడు
నీ ఎదుట లేడు!
ఎచ్చట రైతు నేలను దున్నుతున్నాడో,
ఎచ్చట శ్రామికుడు రాళ్ళు పగులగొట్టుతున్నాడో,
అక్కడ ఆ పరమాత్ముడున్నాడు.
వారితో ఎండలో, వానలో ధూళి ధూపరితములైన వస్త్రములలో ఉన్నాడు.
నీవు కూడా నీ పట్టు పీతాంబరములు ఆవల పెట్టి
ఆనేల మీదికి పదా.....
[మార్చు] చివరి రోజులు
జవహర్లాల్ నెహ్రూ తన జీవితంపై రవీంద్రుని ప్రభావమెంతో ఉన్నదని స్వయంగా చెప్పుకొన్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనందుకు రవీంద్రుడు మానసికంగా కృంగిపోయి అనారోగ్యానికి గురి అయ్యాడు. తీవ్రంగా వ్యాధితో బాధపడుతూ, చికిత్సకై కలకత్తా నగరానికి వెళ్లాడు. కానీ, ప్రయోజనం లేకపోయింది.రచయితగా, సంగీతవేత్తగా, చిత్రకారునిగా, విద్యావేత్తగా గొప్ప మానవతావేత్తగా ఠాగూర్ చరిత్రలో నిలిచిపోయాడు. మాతృభూమి, మానవసంబంధాలపట్ల అచంచలమయిన నమ్మకం, ప్రేమాభిమానాలు కలిగి ఉన్న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, 1941 ఆగస్టు 7న మరణించాడు.
[మార్చు] ఇవి కూడా చూడండి
- రవీంద్రనాథ్ టాగూర్ రచనలు
- ఇల్లు మరియు ప్రపంచము (బెంగాలీ నవల/ఇంగ్లీషు పేరు ది హోమ్ అండ్ ది వరల్డ్)
[మార్చు] వనరులు
- ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక లో ఆళ్ల నాగేశ్వరరావు వ్యాసం ఆదారంగా