పిఠాపురం
వికీపీడియా నుండి
పిఠాపురం మండలం | |
![]() |
|
జిల్లా: | తూర్పు గోదావరి |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | పిఠాపురం |
గ్రామాలు: | 26 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 123.809 వేలు |
పురుషులు: | 62.186 వేలు |
స్త్రీలు: | 61.623 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 63.23 % |
పురుషులు: | 66.54 % |
స్త్రీలు: | 59.88 % |
చూడండి: తూర్పు గోదావరి జిల్లా మండలాలు |
పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక ఒక గ్రామం మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రము.
పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరుకి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో బంగారు పాత్ర, వేరొక చేత బాగుగా పండిన ఉసిరి కాయ, మూడవ చేత త్రిశూలం, నాల్గవ చేత లోహ దండం ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదిట. ఈ విషయాన్ని శ్రీనాధుడు భీమేశ్వర పురాణంలో ఈ కింది విధంగా చెబుతాడు.
"హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్ ఖేటము లోహదండము నొంగి ధరియించి పురోపకంఠశృం గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్"
ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో కుమారస్వామి ఆలయంలో ఉందిట.
పిఠాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు అనే ఏరు ఒకటి ఉంది. ఈ ఏలేరుని "జగతి నెక్కడివేలేటి సాటి నదులు" అంటాడు శ్రీనాధుడు. అలా అనేసి ఊరుకోకుండా,
"ఏలేటి విరినీట నిరుగారునుంబండు ప్రాసంగు వరిచేలు పసిడిచాయ"
అని చెబుతూ పిఠాపురం ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదని అప్పటి ఫల వృక్షాలనీ, పిండివంటలనీ శ్రీనాధుడు వర్ణించేడు. ఒక్క వేరు పనస చెట్లు, పోక తోటలు ఇప్పుడు కనిపించటం లేదేమో కానీ, మిగిలినవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. పిఠాపురం వరకు వచ్చిన శ్రీనాధుడు కళింగ దేశం వరకూ పర్యటించినట్లు ఆధారాలున్నాయి. సింహాచలం వరాహ నృసింహస్వామి ఆలయాన్ని దర్శించిన ఆధారాలూ ఉన్నాయి. కాని, పక్కనే ఉన్న అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్ళిన దాఖలాలు నాకు కనిపించ లేదు. ఆ రోజులలో అన్నవరం కొండ అంత ప్రాచుర్యంలో లేదేమో.
ఏలేరు ఉప్పాడ దగ్గర సముద్రంలో కలుస్తుంది. అన్నవరం దగ్గర ఉన్న పంపా నది కూడ సాగర సంగమం చెందే ముందు ఈ ఏలేటి నీటితో పొన్నాడ దగ్గర కలుస్తుందని చిలుకూరి పాపయ్య శాస్త్రి "శ్రీనాధ కృతి సమీక్ష" అనే పుస్తకంలో రాసేరు. ఒడ్డె రాజులతో వైరం పూనిన విజయనగరం గజపతులు ఈ నదుల సాగర సంగమ స్థానాన్ని పూరీ జగన్నాథంతో సమానమైన దివ్య క్షేత్రంగా రూపొందిద్దామని జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, సుభద్రా దేవి విగ్రహాలని ప్రతిష్ట చేసేరుట. ఈ జగన్నాథ స్వామి చేతులు ఇటీవల మొండి అగుటచే ఈ స్వామిని "మొండి జగ్గప్ప" అని ప్రాంతీయులు పిలుస్తారుట.
పిఠాపురంలో కుంతీమాధవ స్వామి ఆలయం, కుక్కుటేశ్వరుడి కోవెల ఉన్నాయి. వృత్తాసురుడిని చంపిన తర్వాత బ్రహ్మహత్యా పాతకం నుండి తప్పించుకుందికి ఇంద్రుడు ఐదు వైష్ణవాలయాలు స్థాపించేడుట. కాశీలో బిందు మాధవ స్వామి, ప్రయాగలో వేణు మాధవ స్వామి, పిఠాపురంలో కుంతి మాధవ స్వామి, తిరుచునాపల్లిలో సుందర మాధవ స్వామి, రామేశ్వరంలో సేతు మాధవ స్వామి.
భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేదిట. ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ఈనాడు కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైలు స్టేషన్ కి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్తాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది. పురావస్తు పరిశోధక శాఖ వారు తవ్వకాలు జరిపించి చూస్తే బాగుంటుందేమో!
ఈ కుక్కుటేశ్వరుడి ఆలయ ప్రాంగణం లోనే కాలభైరవుడి విగ్రహం "వ్రీడావిహీనజఘనమై" చూసేవారికి సిగ్గును కలిగించేదిగా ఉందిట. వ్రీడావిహీనజఘనంగా వీధులలో తిరిగే కుర్ర కుంకలు కొల్లలుగా ఉన్న మన దేశంలో సిగ్గు పడవలసిన అవసరం ఏముంది?
కుక్కుటేశ్వరుడి గుడికి ఎదురుగా ఒక తటాకం ఉంది. దానిని "పాదగయ" అంటారు. ఈ పాదగయకి ఆ పేరు ఎలా వచ్చిందో వివరిస్తూ రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గంగా తీరమున ఉన్న గయ "గయా శీర్షం" అనీ, పిఠాపురంలో ఉన్నది "పాదగయ" అనీ ఒక సిద్ధాంతం. అందుకనే పాదగయలో స్నానం చేస్తే గంగలో చేసినంత ఫలితం అని ఒక నమ్మకం ఉంది.
గయుడు అనే రాక్షసుడి పాదాలు అక్కడ ఉన్నాయి కనుక ఇది పాదగయ అయిందని మరొక వదంతి. గయుడి పాదాల ప్రస్తావన వచ్చింది కనుక అతగాడి బుర్ర సంగతి కూడ చెబుతాను. ఈ కథ ఏ పురాణంలో ఉందో తెలియదు. ఈ గయుడికీ గయోపాఖ్యానానికీ మధ్య ఏదైనా సంబంధం ఉందో లేదో కూడ తెలియదు. ఈ గయుడిని ఎవ్వరు చంపేరో అస్సలు తెలియదు. ఏది ఏమైతేనేమి, చచ్చిన శవం యొక్క బుర్ర సింహాచలం దగ్గర, పాదాలు పిఠాపురం దగ్గర పడ్డాయిట. అందుకని సింహాచలం నుండి పిఠాపురం వరకు ఉన్న ప్రదేశం పాపభూమి అనేవారు. పాపభూమి కాబట్టే ఈ మధ్య ప్రదేశంలో పుణ్య క్షేత్రాలు లేవుట. "అన్నవరం ఉందే" అని కొందరు అనవచ్చు. ఈ కథాకాలం నాటికి అన్నవరం లేదేమో; ఉండుంటే శ్రీనాథుడు ఎక్కడొ ఒక చోట ప్రస్తావించి ఉండేవాడే!
ఆ రోజులలో వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి (బాలవ్యాస, తర్క వ్యాకరణ సిద్ధాంతి బిరుదాంకితులు), ఓలేటి పార్వతీశం (వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరు), నడకుదుటి వీర్రాజు, ఉమర్ ఆలీషా (తెలుగు పండితులు), పానుగంటి లక్ష్మీ నరసింహం (సాక్షి), నేదునూరి కృష్ణ మూర్తి (సంగీత విద్వాంసులు)మొదలైన వారు అక్కడ ఉండేవారు.
పిఠాపురాన్ని వెలమ రాజులు పాలించే వారు. వీరు సాహిత్యాన్ని బాగా పోషించేరు. వింజమూరి సోమేశ (రాఘవపాడవీయం), వక్కలంక వీరభద్ర కవి (వాసవదత్తా పరిణయం), కూచిమంచి జగ్గ కవి, కూచిమంచి గంగన్న, దేవులపల్లి బాపన్న, పిండిప్రోలు లక్ష్మన్న, అల్లంరాజు సుబ్రహ్మణ్య కవి, దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, రెండవ దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి, ప్రభృతులు పిఠాపురం ఆస్థానంలోని వారే! కాకినాడ లోని పిఠాపురం రాజా వారి కళాశాల పూర్వపు రోజుల్లో పేరున్న కళాశాలే; దరిమిలా ఆ పేరు లోని జిగి తగ్గింది అనుకొండి.
సా. శ. 1930 దశకంలో పిఠాపురంలో జరిగిన "ట్రంకు మర్డర్ కేసు" దర్యాప్తూ, విచారణా బరంపురంలో జరిగేయి. ఈ కేసులో పిఠాపురం రాజా వారి తాలూకు వారు ఎవరో ఇరుక్కున్నారుట. అందుకని ఆ రోజులలో ఇది బాగా పేరు పడ్డ కేసు. ఎవ్వరో ఎవరినో (బట్టలు కుట్టే దర్జీని అని తర్వాత తెలిసింది) ఖూనీ చేసేసి, ముక్కలు ముక్కలుగా కోసేసి, ట్రంకు పెట్టెలో పెట్టేసి ఆ పెట్టెని కురదారోడ్డు పేసెంజరు లోనో హౌరా మెయిల్ లో ఎక్కించేసేరు. (ఆ రోజులలో పిఠాపురంలో మెయిలు బండి ఆగేది.) దరిమిలా రైలు బరంపురం చేరుకునేసరికి ఆ పెట్టె కంపు కొట్టడం, పోలీసులు దానిని అక్కడ దించడం జరిగింది. శవం బరంపురంలో పట్టుబడింది కనుక కేసు అక్కడ నమోదయింది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- బి. కొత్తూరు
- జగపతిరాజపురం
- వెల్దుర్తి
- ప్రో. దొంతమూరు
- ప్రో. రాయవరం
- భోగాపురం
- రాపర్తి
- జములపల్లి
- గోకివాఢ
- మంగితుర్తి
- విరవ
- కోలంక
- వీరరాఘవపురం
- ఇల్లింద్రాడ
- మాధవపురం
- అగ్రహారం (రూరల్)
- విరవాఢ
- మల్లం
- ఫకురుద్దీన్ పాలెం
- జల్లూరు
- గోవిందరాజుపాలెం
- సోమవరం
- కందరాడ
- కుమారపురం
- చిత్రాడ
- నవకందరాడ
[మార్చు] తూర్పు గోదావరి జిల్లా మండలాలు
మారేడుమిల్లి - వై.రామవరం - అడ్డతీగల - రాజవొమ్మంగి - కోటనందూరు - తుని - తొండంగి - గొల్లప్రోలు - శంఖవరం - ప్రత్తిపాడు - ఏలేశ్వరం - గంగవరం - రంపచోడవరం - దేవీపట్నం - సీతానగరం - కోరుకొండ - గోకవరం - జగ్గంపేట - కిర్లంపూడి - పెద్దాపురం - పిఠాపురం - కొత్తపల్లె - కాకినాడ(గ్రామీణ) - కాకినాడ (పట్టణ) - సామర్లకోట - రంగంపేట - గండేపల్లి - రాజానగరం - రాజమండ్రి (గ్రామీణ) - రాజమండ్రి (పట్టణ) - కడియం - మండపేట - అనపర్తి - బిక్కవోలు - పెదపూడి - కరప - తాళ్ళరేవు - కాజులూరు - రామచంద్రాపురం - రాయవరం - కపిలేశ్వరపురం - ఆలమూరు - ఆత్రేయపురం - రావులపాలెం - పామర్రు - కొత్తపేట - పి.గన్నవరం - అంబాజీపేట - ఐనవిల్లి - ముమ్మిడివరం - ఐ.పోలవరం - కాట్రేనికోన - ఉప్పలగుప్తం - అమలాపురం - అల్లవరం - మామిడికుదురు - రాజోలు - మలికిపురం - సఖినేటిపల్లి