కొంగర జగ్గయ్య
వికీపీడియా నుండి
కొంగర జగ్గయ్య ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితుడు. మేఘ గంభీరమైన ఆయన కంఠం కారణంగా ఆయన "కంచు కంఠం" జగ్గయ్యగా, వాచస్పతిగా పేరుగాంచాడు.
విషయ సూచిక |
[మార్చు] బాల్యము మరియు యుక్త వయసు
జగ్గయ్య గుంటూరు జిల్లాలోని తెనాలికి సమీపంలో దుగ్గిరాల దగ్గర మోరంపూడి అనే గ్రామంలో, 1928 డిసెంబర్ 31న ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. 11 సంవత్సరాల అతి పిన్న వయసులోనే రామాయణంలోని లవుడి పాత్రను బెంగాలీ రచయిత ద్విజేంద్రలాల్ రాయ్ వ్రాసిన సీత అనే ఒక హిందీ నాటకంలో పోషించాడు.[1] విద్యార్ధిగా ఉన్నప్పుడే తెనాలిలో కాంగ్రేసు పార్టీ లో చేరి భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నాడు. పాఠశాల చదువు సాగుతున్న రోజుల్లోనే కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూపు కు తెనాలిలో సెక్రటరీగా పనిచేసాడు. ఆ సమయంలో నాగపూరు తదితర ప్రాంతాల్లో జరిగే పార్టీ సదస్సులకు హాజరై ఆ సదస్సుల్లో పార్టీ చేసే తీర్మానాలను తెలుగులోకి అనువదించి, వాటిని సైక్లోస్టైల్ తీయించి ఆంధ్రదేశంలో పంచిపెట్టేవాడు. ఇంటర్మీడియట్ తరువాత కొంత కాలం దేశాభిమాని అనే పత్రికలో ఉప సంపాదకుడిగానూ, ఆ తర్వాత ఆంధ్రా రిపబ్లిక్ అనే ఆంగ్ల వారపత్రికకు సంపాదకుడిగానూ పని చేశాడు.
ఉన్నత చదువులకు గుంటూరు లోని ఆంధ్రా క్రిస్టియను కళాశాలలో చేరాడు. ఇక్కడే నందమూరి తారక రామారావుతో పరిచయం ఏర్పడినది. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు; జగ్గయ్య మూడు సంవత్సరాలపాటు వరుసగా ఉత్తమ నటుడు పురస్కారం పొందాడు. ప్రముఖ చిత్రకారుడు అడివి బాపిరాజు వద్ద చిత్రలేఖనంలో శిక్షణ పొందాడు. విజయవాడ లో అరుణోదయ, నేషనల్ ఆర్ట్ థియేటర్స్ సంస్థల తరపున నాటకాలు వేశాడు. డిగ్రీ పూర్తవగానే తెనాలి దగ్గర ఉన్న దుగ్గిరాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగమొచ్చింది. అప్పుడు కూడా పాఠశాలలో పనవగానే రైల్లో బెజవాడకు వెళ్ళి రిహార్సల్స్ చేయడం, నాటకాలు వేయడం చేస్తుండేవాడు. ఎన్.టి.రామారావుతో కలిసి విజయవాడలో రవి ఆర్ట్ థియేటర్ స్థాపించి ఎన్నో నాటకాలు వేసి పరిషత్తు పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు. బుచ్చిబాబు వ్రాసిన దారిన పోయే దానయ్య నాటిక వీరికి బాగా పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఢిల్లీలో ఆల్ ఇండియా రేడియోలో మూడు సంవత్సరాలపాటు వార్తలు చదివే ఉద్యోగం చేసారు. అక్కడ కూడా తెలుగువాళ్ళను పోగేసి నాటకాలు వేశారు.
[మార్చు] సినిమాలలో
త్రిపురనేని గోపిచంద్ తీసిన ప్రియురాలు సినిమాతో జగ్గయ్య సినిమాలలో అరంగేట్రం చేసాడు.[1] అయితే ఈ సినిమాగానీ, దీని తదుపరి చిత్రాలు కాని పెద్దగా విజయం సాధించలేదు. సినిమాల కోసం మొదట రేడియో ఉద్యోగానికి ఒక సంవత్సరం సెలవు పెట్టాడు. తర్వాత సినిమా రంగంలోనే కొనసాగాలని నిశ్చయించుకుని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాడు. అర్ధాంగి మరియు బంగారు పాప చలన చిత్రాల విజయంతో మళ్ళీ వెలుగులోకి వచ్చాడు. 1950ల నుండి 1970ల వరకు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవ చేసాడు. మరణించేవరకు కూడా అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తూనే ఉండేవాడు. కొన్ని చలన చిత్రాలలో కథానాయకునిగా, ఎక్కువ చిత్రాలలో సహాయనటునిగా, హాస్య పాత్రలలో మరియు ప్రతినాయకుని పాత్రలలో నటించాడు. "కళాకారుడు తనలోని కళాదాహాన్ని తీర్చుకోవడానికి రోటీన్ హీరో పాత్రలు సరిపోవు." అని నమ్మిన వాడు కాబట్టే ఆయన విభిన్నమైన పాత్రల మీద ఆసక్తి చూపించాడు. అలా కొన్నిసార్లు తనకు హీరో పాత్ర ఇవ్వచూపిన వాళ్లను కూడా అదే కథలోని కొంచెం క్లిష్టమైన లేదా వైవిధ్యమైన పాత్ర ఇవ్వమని అడిగేవాడు!
అప్పట్లో సాంఘిక చిత్రాల్లోని ప్రతినాయక పాత్రలు కూడా పౌరాణిక ప్రతినాయక పాత్రల్లానే ఉండేవి. ఆ పద్ధతి మార్చాలని జగ్గయ్య ప్రతినాయక పాత్రలను ఎంచుకున్నాడు. కథానాయకుడు అందంగా ఉంటే ప్రతినాయకుడు కూడా అందంగానే ఉంటాడు. మన మధ్య తిరిగే మామూలు మనిషిలానే ఉంటాడు. అలా చూపించాలనే ఆయన ప్రతినాయక పాత్రలు చేశాడు. ప్రతినాయకుడు అంటే, వికారంగా, కౄరంగా ఉండాలనే అభిప్రాయం పోగొట్టాడు. "విలన్ కూడా లవబుల్ గానే ఉండాలి. అప్పుడే అతను మరిన్ని మోసాలు చేయగలడు. అలాంటి పాత్రల్లో అభినయ సునిశితత్వాన్నిప్రదర్శించడానికి మంచి అవకాశముంటుంది." అనేది ఆయన అభిప్రాయం. ఆయన దాదాపు 500 చిత్ర్రాల్లో నటించాడు. ఆయన నటించిన ఏకైక తమిళ చిత్రం శివగామి.
[మార్చు] కంఠం
జగ్గయ్య గురించి చెప్పేటప్పుడు ఆయన కంఠం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గంభీరమైన తన కంఠాన్ని ఎంతోమందికి అరువు ఇచ్చాడు. 100కు పైగా సినిమాలలో డబ్బింగు చేసాడు. తమిళ చిత్రరంగ ప్రముఖుడైన శివాజీ గణేశన్ నటించిన తెలుగు సినిమాలలో జగ్గయ్యే ఆయనకు గాత్రధారణ చేసేవాడు. అంతేకాదు తెలుగులోకి డబ్బింగు చేసిన జురాసిక్ పార్క్ అనే ఆంగ్ల చిత్రంలో రిచర్డ్ అట్టెంబరో పాత్రకు తన గాత్రాన్ని అరువు ఇచ్చాడు.
[మార్చు] పేరు తెచ్చిన పాత్రలు
- బంగారు పాప లో: బంగారు పాపలో ఆయన పోషించింది చాలా సున్నితమైన, సంక్లిష్టమైన పాత్ర. పాతికేళ్ళ వయసులోనే ఆ చిత్రంలో వృద్ధునిగా నటించాడు. తెలుగు స్వతంత్రలో ఒక చలన చిత్రం మీద సమీక్ష రావడమే ఒక గొప్ప విశేషమైతే అందులో ప్రముఖ పాత్రికేయుడు ఖాసా సుబ్బారావు బంగారు పాప మీద సమీక్ష వ్రాస్తూ "హామిలీషియన్ (షేక్స్ పియర్ నాటకం హామ్లెట్ లోని ప్రధాన పాత్ర అయిన హామ్లెట్ తో పోల్చదగిన అని అర్థం) రోల్ ప్లేయ్డ్ బై మిస్టర్ జగ్గయ్య ఇస్ సుపర్బ్ లీ కన్విన్సింగ్." అని వ్రాశాడు. అది తనకు కొన్ని సంవత్సరాల పాటు ఉత్తేజాన్నిచ్చిందని జగ్గయ్య అన్నాడు.
- అర్థాంగి లో: బంగారు పాప తర్వాత వెంటనే అర్థాంగి చిత్రంలో ప్రతినాయక పాత్రలో నటించాడు. ఈ రెండు చిత్రాలు ఆయన్ను వైవిధ్యమైన నటుడిగా నిలబెట్టాయి.
- అల్లూరి సీతారామరాజు సినిమా లో పోషించిన రూథర్ ఫర్డ్ పాత్ర: ఇది ఆయన జీవితంలో మరపురాని పాత్ర. ఆ సినిమా తీసే నాటికి రూథర్ ఫర్డ్ చరిత్ర మరచిపోయిన వ్యక్తి కాదు. ఆయన ఎలా ఉంటాడో, ఎలా ప్రవర్తించేవాడో తెలిసిన వాళ్ళు అప్పటికి ఉన్నారు. ఆయన 1940 వరకు ప్రభుత్వ సర్వీసులో ఉన్నాడు. కృష్ణా జిల్లా, గుంటూరు, కడప తదితర ప్రాంతాల్లో పనిచేశాడు. అప్పటి ఐ.సి.ఎస్. అధికార్లలో చాలా మందికి ఆయన బాగా తెలుసు. వాళ్ళను వాకబు చేసి జగ్గయ్య రూథర్ ఫర్డ్ ప్రవర్తన గురించి, మనస్తత్వం గురించి తెలుసుకున్నాడు. అప్పుడు ఆయనకు రూథర్ ఫర్డ్ చాలా మంచి వ్యక్తి అని, ఆయనకు సీతారామరాజు అంటే గౌరవం ఉండేదని తెలిసింది. అయితే రూథర్ ఫర్డ్ బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడు. ఆయన వైపు నుంచి చూస్తే బ్రిటిష్ ప్రభుత్వ సేవకుడిగా ఆయన సీతారామరాజును పట్టుకుని తీరాలి. ఇది తెలిశాక జగ్గయ్య చిత్ర రచయిత మహారథిని కలిసి ఆ పాత్రను రొటీన్ విలన్ లా కాకుండా విధి నిర్వహణకు బద్ధుడై ఉండే హుందా అయిన వ్యక్తిలా మార్చి వ్రాయాలని కోరాడు. అలా ఆ పాత్ర చిత్రణ మార్చడంతో ఆ పాత్ర నిలబడడంతో బాటు సీతారామరాజు పాత్ర మరింతగా ఎలివేట్ అయింది. ఆ సినిమా చూశాక పి.వి.నరసింహారావు జగ్గయ్యకు ఫోన్ చేసి "మీ పాత్ర పోషణ అద్భుతం." అని ప్రశంసించారట.
[మార్చు] నిర్మాతగా
- పదండి ముందుకు (1962): (రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందిన మొదటి చిత్రం) నిజానికి ఈ సినిమాకు నిర్మాత జగ్గయ్యే అయినా పేరు మాత్రం తుమ్మల కృష్ణమూర్తిది. ఈ సినిమాను 1930 లో గాంధీజీ నాయకత్వంలో జరిగిన సహాయ నిరాకరణోద్యమం నేపథ్యంలో డాన్సులు, డ్యుయెట్ల వంటి ఆకర్షణలు లేకుండా తీశారు. ఈ తొలి రాజకీయ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం 50,000 రూపాయల పురస్కారాన్ని ఇచ్చింది. ఈ సినిమా రష్యా లో తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ తో బాటు మరికొన్ని నగరాల్లో ప్రదర్శితమైంది. ఈ చిత్రానికి సంభాషణలతో బాటు చిత్రం చివర్లో వచ్చే 'మంచికి కాలం తీరిందా' అనే పాటను కూడా జగ్గయ్యే వ్రాశాడు. ఇది మహమ్మద్ రఫీ పాడిన తొలి తెలుగు పాట.
- శభాష్ పాపన్న
[మార్చు] రాజకీయాలు
జగ్గయ్య విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాలలో చాలా చురుకుగా ఉండే వాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోషలిస్టు గ్రూపులతో సంబంధాలు కూడా ఉండేవి. వాటిని నిషేధించిన తరువాత జయప్రకాష్ నారాయణ స్థాపించిన ప్రజా సోషలిస్టు పార్టీలో చేరాడు. 1956లో జవహర్లాల్ నెహ్రూ పిలుపుకు స్పందించి, తిరిగి కాంగ్రేసులో చేరాడు. 1967లో నాలుగవ లోక్సభకు జరిగిన ఎన్నికలలో ఒంగోలు నియోజక వర్గం నుండి కాంగ్రేసు పార్టీ తరుపున పోటీ చేసి గెలిచాడు. అలా జగ్గయ్య లోక్సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీనటుడు అయ్యాడు. [1] [2]
[మార్చు] సాహిత్యంలో కృషి
నోబెల్ పురస్కారము అందుకున్న రవీంద్రుని గీతాంజలిని రవీంద్ర గీతా అనే పేరుతో తెలుగులోకి అనువాదించారు. గీతాంజలికి ఇది తొలి తెలుగు అనువాదం. రవీంద్రనాథ ఠాగూరు రాసిన నాటకం సాక్రిఫైస్ (Sacrifice) ను తెలుగులోకి బలిదానం అనే పేరుతో అనువదించాడు.
[మార్చు] పురస్కారాలు, సన్మానాలు
- భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ తో సత్కరించింది.
- ఢిల్లీ లోని సంస్కృత విశ్వవిద్యాలయం కళా వాచస్పతి అనే బిరుదుతో జగ్గయ్యను సత్కరించింది.
- తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.
- తమిళనాడు ప్రభుత్వం కలైమామణి బిరుదు నిచ్చింది.
- ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.
- జగ్గయ్య నిర్మించిన పదండి ముందుకు అనే సినిమాకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 50,000 రూపాయల ప్రోత్సాహకం లబించింది.
[మార్చు] మరణము
2004 మార్చి 5 న 76 సంవత్సరాల వయసులో చెన్నైలో గుండెపోటుతో జగ్గయ్య మరణించాడు. [3].
[మార్చు] మూలాలు
- ↑ 1.0 1.1 1.2 ఫిలించాంబర్.కాంలో జగ్గయ్య జీవిత విశేషాలపై ఒక వ్యాసం.
- ↑ తెలుగుసినిమా.కాంలో జగ్గయ్య సంస్మరణార్ధం ప్రచురించిన ఒక వ్యాసం.
- ↑ ది హిందు పత్రికలో జగ్గయ్య మరణం సందర్భంగా మార్చి 6, 2004లో వచ్చిన వార్త.
[మార్చు] బయటి లింకులు
- ఐఎండిబి.కాంలో జగ్గయ్య సినిమాల గురించి.